HomeArticlesనాలుగు భారత కంపెనీలపై అమెరికా ఆంక్షల ఎత్తివేత: హైదరాబాద్ సంస్థలకు ఊరట

నాలుగు భారత కంపెనీలపై అమెరికా ఆంక్షల ఎత్తివేత: హైదరాబాద్ సంస్థలకు ఊరట

రష్యా కంపెనీలతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో గతంలో ఆంక్షలకు గురైన నాలుగు భారతీయ సంస్థలపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా వీటిపై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలోని ఆర్‌ఆర్‌జీ ఇంజినీరింగ్‌ టెక్నాలజీస్‌, లోకేష్‌ మెషిన్స్‌ లిమిటెడ్‌ కంపెనీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి.


గతంలో గెలాక్సీ బేరింగ్స్‌, శౌర్య ఏరోనాటిక్స్‌, ఆర్‌ఆర్‌జీ ఇంజినీరింగ్‌ టెక్నాలజీస్‌, లోకేష్‌ మెషిన్స్‌ లిమిటెడ్‌ కంపెనీలను అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో, రక్షణ రంగానికి సంబంధించిన కీలక పరికరాలు, సాంకేతికత రష్యాకు అందకుండా అగ్రరాజ్యం ఈ ఆంక్షలు విధించింది.


గెలాక్సీ బేరింగ్స్‌ లిమిటెడ్‌ రోలర్ బేరింగ్‌లు, అసెంబుల్‌ పరికరాలను రష్యన్ సంస్థలకు సరఫరా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది. శౌర్య ఏరోనాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ రాడార్ పరికరాలు, రేడియో నావిగేషనల్ ఎయిడెడ్‌ పరికరాలను రష్యాకు పంపిందనే కారణంతో నిషేధానికి గురైంది. ఆర్‌ఆర్‌జీ ఇంజనీరింగ్ టెక్నాలజీస్‌, నిషేధిత రష్యా కంపెనీ ఆర్టెక్స్ లిమిటెడ్‌కు వందకు పైగా మైక్రోఎలక్ట్రానిక్స్ సరుకులను అందించింది. లోకేష్ మెషీన్స్ సంస్థ కూడా రష్యన్ తయారీ కంపెనీలకు మెషిన్ టూల్స్ రవాణా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంది.


ఈ సంస్థల వ్యవహారాలపై అమెరికా ఇటీవల సమీక్ష జరిపింది. అభ్యంతరాలు లేకపోవడంతో, నాలుగు భారతీయ కంపెనీలపై విధించిన ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం భారత పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags

#అమెరికా ఆంక్షలు#భారత కంపెనీలు#రష్యా#హైదరాబాద్ కంపెనీలు#వాణిజ్య సంబంధాలు